< రాజులు~ రెండవ~ గ్రంథము 12 >

1 యెహూ పరిపాలనలో ఏడవ సంవత్సరంలో యోవాషు తన పరిపాలన మొదలుపెట్టి యెరూషలేములో 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబా ప్రాంతానికి చెందిన జిబ్యా. 2 యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంత కాలం అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు. 3 అయితే పూజా స్థలాలను తీసివేయలేదు. ప్రజలు ఇంకా అలాటి చోట్ల బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు. 4 యోవాషు యాజకులతో ఇలా అన్నాడు. “యెహోవా మందిరంలోకి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువుల వల్ల వచ్చే డబ్బును యెహోవా మందిరంలోకి తేవాలి. ప్రతి మనిషీ చెల్లించే పన్ను మొత్తాన్నీ, ప్రతి మనిషీ యెహోవా ప్రేరణ మూలంగా తన హృదయంలో నిర్ణయించుకుని ఆలయం పని కోసం చెల్లించిన డబ్బును తేవాలి. 5 యాజకులు ప్రజలు కట్టిన ఆ పన్ను మొత్తాన్ని సేకరించాలి. మందిరం మరమ్మత్తు పని కోసం ఆ డబ్బు వినియోగిస్తూ, మందిరాన్ని మంచి స్థితిలో ఉంచాలి.” 6 అయితే యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరం దాకా యాజకులు మందిరం మరమ్మత్తులను చేపట్టనే లేదు. 7 అప్పుడు యోవాషు యాజకుడైన యెహోయాదాను, మిగిలిన యాజకులను పిలిపించి “మందిరంలో శిథిలమైన భాగాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇకపై పన్ను చెల్లించే వారి దగ్గర డబ్బు తీసుకోకండి. మందిరం మరమ్మత్తుల కోసం ఇంత వరకూ సేకరించిన మొత్తాన్ని ఆ పని చేసే వారికే అప్పగించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 8 కాబట్టి యాజకులు మందిరం మరమ్మత్తు పనులు వారు చూడడం లేదు గనక ఇకపై ప్రజల దగ్గర డబ్బు తీసుకోవడం మానుకున్నారు. 9 యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు. 10 ౧౦ పెట్టె నిండి పోయిన ప్రతిసారీ రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా ఆలయంలోని డబ్బు లెక్క చూసి సంచుల్లో ఉంచారు. 11 ౧౧ తరువాత వారు ఆ డబ్బును తూచి యెహోవా మందిరం వ్యవహారాలు చూసుకునే వారికి ఇచ్చారు. వారు యెహోవా మందిరం మరమ్మత్తు పని చేసే వడ్రంగులకు, కట్టే పనివారికి ఆ డబ్బు ఇచ్చారు. 12 ౧౨ ఇంకా తాపీ పని వాళ్ళకి, రాళ్లు చెక్కే వారికీ యెహోవా మందిరం మరమ్మత్తుకై కలప, చెక్కిన రాళ్ళూ కొనడానికి ఇంకా మందిరం బాగు చేయడానికి అయ్యే ఖర్చు కోసం ఆ డబ్బు ఇస్తూ వచ్చారు. 13 ౧౩ యెహోవా మందిరం కోసం వెండి పాత్రల కోసం గానీ, కత్తెరలు, గిన్నెలు, బాకాలు, బంగారు వెండి వస్తువులు మొదలైన వాటి కోసం గానీ ఆ డబ్బు వాడలేదు. 14 ౧౪ కేవలం యెహోవా మందిరాన్ని మరమ్మతు పని చేసే వారికి మాత్రమే ఆ డబ్బు ఇచ్చారు. 15 ౧౫ మరమ్మత్తుల కోసం ఆ డబ్బు తమ దగ్గర ఉంచి పనివారికి ఇస్తూ ఉండే వారు నమ్మకస్థులు గనక ఎవరూ వారిని లెక్క అడగలేదు. 16 ౧౬ అపరాధ పరిహార బలుల మూలంగా పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి. ఎందుకంటే అది యాజకులది. 17 ౧౭ అటు తరువాత సిరియా రాజు హజాయేలు గాతు పట్టణంపై దాడి చేసి దాన్ని వశపరచుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రావాలని ఉన్నాడు. 18 ౧౮ యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు. 19 ౧౯ యోవాషు గురించిన మిగతా విషయాలు, అతని యితర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉన్నాయి కదా. 20 ౨౦ అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు. 21 ౨౧ షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.

< రాజులు~ రెండవ~ గ్రంథము 12 >